డీపీఆర్వోలకు ఐఅండ్పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజుల్లో పూర్తిచేయాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక డీపీఆర్వోలను ఆదేశించారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధివిధానాలపై శుక్రవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో డీపీఆర్వోలు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. జీవోలు 252, 103లపై డీపీఆర్వోలు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, అప్రూవల్ లిస్టులు, రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపు, అక్రెడిటేషన్ కార్డుల డౌన్లోడింగ్ వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్, ఇతర సమస్యలు తలెత్తితే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా రిలేషన్ వింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అక్రెడిటేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కార్డులను జారీచేయాలని డీపీఆర్వోలకు సూచించారు. కార్డుల జారీ, ఆన్లైన్ విధివిధాలపై డీపీఆర్వోలు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. http// ipr.telangana. gov.in ద్వారా అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే 9154170881ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాలశాఖ అదనపు సంచాలకుడు డీఎస్ జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్రావు, జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస్, రమణ, మధుసూదన్, వెంకటేశ్వర్లు, హష్మీ, రాజారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని, తదితరులు పాల్గొన్నారు.