మన్సూరాబాద్, జూలై 21: తెలంగాణలోని గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు సరైన వసతులు కల్పిస్తున్నారని పన్నెండుమెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కొనియాడారు. గురువారం ఆయన తన ఇద్దరు మనుమరాళ్లను మన్సూరాబాద్ డివిజన్ పనామా చౌరస్తా సమీపంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ (బార్కాస్ గర్ల్స్-1 బ్రాంచ్)లో చేర్పించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలకు వచ్చిన ఆయన.. ఇక్కడ కల్పిస్తున్న వసతులపై సంతృప్తి వ్యక్తంచేశారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నారంటూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మొగులయ్యను పాఠశాల ప్రిన్సిపాల్ రాణీ కాజీపురం సన్మానించారు.