హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): విమానాశ్రయాల్లో పక్షులతో సంభవించే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, 2018 నుంచి 2023 వరకు ఆర్జీఐఏ ఎయిర్పోర్టులో 183 బర్డ్ స్ట్రయిక్స్ జరిగినట్టుగా కేంద్రమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు. 2018లో 27, 2019లో 16, 2020లో 34, 2021లో 29, 2022లో 39, 2023లో 38 ప్రమాదాలు జరిగినట్టు వివరించారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులలో పక్షుల కారణంగా జరిగిన ప్రమాదాలపై శనివారం ఆయన ఓ నివేదికను వెల్లడించారు. ఇందులో ఈ ఏడాది కాలంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో(169), మహారాష్ట్ర(131), గుజరాత్(114), కేరళ(92) ప్రమాదాలు జరిగినట్టు స్పష్టం చేశారు. కాగా సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఎయిర్పోర్టుకు ఒక కిలోమీటర్ పరిధిలో పక్షులు, జంతువుల సంచారాన్ని నియంత్రించాల్సి ఉందని, పక్షులతో కలిగే ప్రమాదంతో విమానాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.