హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను షెడ్యూల్డ్ కులాల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి జేపీ దర్గా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ దర్గా విస్తరణకు కావాల్సిన నాలుగు ఎకరాల భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బైపాస్ రోడ్డు, బస్టాండ్, రోడ్ల విస్తరణ, వాష్ రూమ్స్, అతిథి గృహ నిర్మాణాలతో భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్, సీఈవో షానవాజ్ ఖాసీం, కలెక్టర్ అమయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.