కోడెరు : భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన చికిరాల వెంకయ్య నాలుగేళ్ల కిందట ఆరోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయనకు రేకులపల్లి గ్రామం శివారులో సర్వేనంబరు 228.3.4.180 ఎకరా 12 గంటల భూమి పట్టాభూమి ఉంది.
ఈ భూమిని వెంకయ్య తనయుడు సాయిబాబా తన పేరిట విరాసత్ చేసుకునేందుకు గతేడాదిలో మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి భూమి పేరిట మార్చుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో సైతం దరఖాస్తు చేసుకున్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్ను కలవాలని పంపారని.. డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తంను కలువగా.. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడుపుతూ వచ్చాడు. చివరకు విసుగు చెందిన రైతు ఏమన్నా కావాలా? సర్ అడిగితే గత 20 రోజుల కిందట రూ.15వేలు ఇస్తేనే విరాసత్ చేస్తానని, లేకపోతే చేయనని డెప్యూటీ తహసీల్దార్ తెగేసి చెప్పాడు.
రూ.8వేలు ఇస్తానన్నా వినలేదు. చివరకు రూ.10వేలకు ఒప్పందం చేసుకొని.. సాయిబాబా తన అన్న కుమారుడితో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3.25 గంటల సమయంలో చీకిరాల నాగేంద్ర నుంచి డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం రూ.10వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ వివరించారు. పురుషోత్తంను మంగళవారం హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరు పరుచనున్నట్లు వివరించారు. దాడుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ ఏసీబీ ఇన్స్పెక్టర్ లింగస్వామి, నల్గొండ జిల్లా ఇన్స్పెక్టర్ వెంకటరావుతో పాటు మరో పది మంది సిబ్బంది పాల్గొన్నారు.