నిజామాబాద్ క్రైం, జూన్ 29: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నిజామాబాద్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్రెడ్డి ఇండ్లల్లో రెండో రోజైన గురువారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్, హైదరాబాద్లోని ఆయన ఇండ్లల్లో తనిఖీ చేయగా రూ.78 లక్షల నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు, బ్యాంక్ డిపాజిట్ పేపర్లు, విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో అప్పగించారు. కాగా లంచం తీసుకుంటూ ఏడీతోపాటు పట్టుబడ్డ సూపరింటెండెంట్ వెంకటేశ్, జూనియర్ అసిస్టెంట్ రహీమా ఇండ్లల్లో సోదాలు నిర్వహించగా ఎలాంటి అక్రమ ఆస్తులు బయటపడలేదని ఏసీబీ అధికారులు తెలిపారు.