హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు కనుగొన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుట్టు రట్టు చేసినట్టు తెలిసింది. లక్ష్మీకుమార్ రెడ్హిల్స్లోని డివిజన్-8లో విధులు నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయించి రోజూ రూ.50వేల వరకు సంపాదించేవారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అపార్ట్మెంట్లకు సరఫరా చేసే ట్యాంకర్లకు ఒక్కో దానికి రూ.5000 చొప్పున వసూలుచేసేవారని తెలిసింది. ట్యాంకర్ల ద్వారా విక్రయించిన నీటి సొమ్మును తన జేబులోనే వేసుకొనేవారని సమాచారం. తన సుదీర్ఘ సర్వీసులో అక్రమ సంపాదనకు అలవాటు పడి, నిధులను దుర్వినియోగం చేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులు కూడబెట్టినట్టు తేలింది.
ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున మల్లాపూర్లోని ఆయన నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఇండ్లల్లో మరో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, భూముల పత్రాలు లభ్యమయ్యాయి. రూ.1.1 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు, ఒక లగ్జరీ ఇల్లు, ఒక మారుతీ రిట్జ్ కారు, ఒక బజాజ్ మోటర్ బైక్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న స్థిర, చర ఆస్తుల విలువ రూ.5,88,55,490గా ఉన్నట్టు గుర్తించారు, దీని మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువగా సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగాయి, నిందితుడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిజామాబాద్లోనూ జీఎం ఆస్తులు
హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మీకుమార్కు చెందిన ఆస్తులు నిజామాబాద్ జిల్లాలోనూ బయటపడ్డాయి. సదరు అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు మంగళవారం పలుచోట్ల దాడులుచేశారు. ఇందులో భాగంగా గతంలో సదరు అధికారి పనిచేసిన నిజామాబాద్ జిల్లాలోనూ తనిఖీలు చేపట్టారు. అనంతలక్ష్మీకుమార్ సతీమణి పేరిట ఎల్కే ఫామ్ పరిధిలో అర ఎకరం కొబ్బరితోట ఉన్నట్టు గుర్తించి అధికారులు, పంచుల సమక్షంలో రికార్డు చేసినట్టు ఏసీబీ ఇన్స్పెక్టర్ వేణుకుమార్ తెలిపారు.