Nizamabad | నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ విషయంలో క్లియరెన్స్ ఇచ్చేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేసిన విషయంపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు.
జిల్లా కేంద్రంలోని కుమార్గల్లీ ప్రాంతానికి చెందిన బంటు రామరాజు అనే వ్యక్తికి సంబంధించిన భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తొలగించేందుకు గానూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీసాల రాజు రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు గురువారం రామరాజు రూ.8 వేలు తీసుకొని సౌత్ తహసీల్ కార్యాలయంలోని ఆర్ఐ రాజు వద్దకు వెళ్లి అతనికి డబ్బులు అందజేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తి మంత్రి హరీశ్కుమార్ సైతం ఆర్ఐకి సహకరించాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులు తీసుకున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్ఐ రాజుతో పాటు అతనికి సహకరించిన హరీశ్కుమార్లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.