హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): సింగరేణి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలిసింది. నియామకాల పేరుతో డబ్బు వసూలు చేసిన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సింగరేణి యాజమాన్యం స స్పెండ్ చేసింది.
తాజాగా ఇదే అంశంపై సింగరేణి ఎండీ బలరాం ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమేశ్ నేతృత్వంలో సింగరేణిలో నియామకాల పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. అలాగే పశుసంవర్ధక శాఖలోని గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఫైళ్ల మాయంపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. కాంట్రాక్టర్తో కలిసి పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారులు, సిబ్బంది నిధులు గోల్మాల్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన రూ.2.20 కోట్లు దారి మళ్లినట్టు తేల్చారు.