హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏలో అవినీతి జలగలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సంచలనం సృష్టించిన శివబాలకృష్ణ వ్యవహారం విచారణ చేపడుతుండగానే అదే విభాగంలో మరో అధికారి లీలలు వెలుగులోకి వచ్చాయి. ట్రాన్స్ఫరెబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరుతో హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ బీవీ కృష్ణకుమార్ భారీ మోసాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. అతని చర్యల వల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.3,800 కోట్ల నష్టం జరిగినట్లు ఏసీబీ అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. శివబాలకృష్ణ, కృష్ణకుమార్ కలిసే ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
హెచ్ఎండీఏలో మాజీ డైరెక్టర్గా శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంతోనే ముందస్తుగా కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఎలాగైనా తనపేరు బయటికి వస్తుందనే భయం తో విదేశాల్లోనే తలదాచుకున్నట్టు సమాచారం. బడా బిల్డర్ల ప్రాజెక్టులో టీడీఆర్ వాల్యూ భారీగా తగ్గించి బిల్డర్లకు లబ్ధి చేకూర్చిన వారిలో కృష్ణకుమార్తో పాటు మరో ఇద్దరు టౌన్ప్లానింగ్ అధికారులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీరంతా కలిసి ఇబ్బడిముబ్బిడిగా బిల్డింగులకు అనుమతులు ఇచ్చారని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. అయితే, గతంలోనే కృష్ణకుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు వేల కోట్ల వ్యవహారం బయటికి పొక్కడంతో కృష్ణకుమార్ను హైదరాబాద్కు రప్పించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.