Shiva Balakrishna | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు. బాలకృష్ణ ఇంటితోసహా 18 చోట్ల సోదాలు చేపట్టి, స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బాలకృష్ణ ఇంట్లోని 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు పరిశీలించగా.. వాటి ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.5 కోట్లుపైన ఉంటుందని, బహిరంగ మార్కెట్లో దానికి పది రెట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. వీటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.. రూ.32 లక్షల విలువైన టాగ్ హ్యూయర్, రోలెక్స్, రాడో, ఫాసిల్, టిస్సాట్ తదితర పలు బ్రాండ్లకు చెందిన 120 ఖరీదైన రిస్టు వాచీలు, ఆరుచోట్ల ఫ్లాట్లు గుర్తించినట్టు తెలిపారు.
అన్ని సిరీస్లలో భారీగా ఐఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్టు పేరొన్నారు. వీటికితోడు 20 ఎల్ఐసీ పాలసీ బాండ్లు, రూ.58 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 155 డాక్యుమెంట్ షీట్లు, 4 పాస్బుక్స్, ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ తాము సోదాలు చేసినట్టు తెలిపారు. ఈ సోదాల్లో బాలకృష్ణకు పలువురు బినామీలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిని విచారించేందుకు కొంత సమయం కావాలని రిపోర్టులో తెలిపారు. ఈ అవినీతిలో ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉన్నదని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్లో ప్రమోద్కుమార్, మాదాపూర్లో కొమ్మిడి సందీప్రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి నివాసాలుసహా మొత్తం 18 చోట్ల సోదాలు చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 1994లో గ్రూప్-1 అధికారిగా సర్వీసులో చేరిన శివ బాలకృష్ణ.. 30 ఏండ్ల సర్వీసులో రూ.వందల కోట్ల ఆస్తులు సంపాదించారని ఏసీబీ అధికారులు గుర్తించారు.