హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మండిపడింది. ఏసీబీ కోర్టుకు సమాచార నిమిత్తం మెమో దాఖలు చేస్తే ఏకంగా కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం దారుణమని సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ను ప్రతిపాదిత నిందితులుగా చేర్చుతున్నట్టు దాఖలు చేసి మెమోను కొట్టేయడాన్ని వ్యతిరేకిస్తూ సిట్ వేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్పై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
రద్దు చేయకపోతే తీరని అన్యాయమే
సిట్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ..ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చదివితే తన పరిధిని ఎంత దాటిందో అర్థం అవుతుందన్నారు. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశాక మెటీరియల్స్ ఆధారంగా ఏసీబీ కోర్టు చేయాల్సిన పనిని కేసు ప్రాథమిక దశలోనే చేసేసిందని తప్పుపట్టారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 వర్తించదని, కేసు విచారణ దశలో ఏసీబీ కోర్టు వెలువరించిన ఉత్తర్వులను తక్షణమే కొట్టేయాలని, లేకపోతే అనేక ఏసీబీ, క్రిమినల్ కేసుల్లో తీర ని అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి నుంచి బీఎల్ సంతోష్కు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని సిట్ చెబితే, ఆ మెసేజ్కు బీఎల్ సంతోష్ నుంచి జవాబు లేదని ఏసీబీ కోర్టు మెమోను రద్దు చేయడం సమర్థనీయం కాదన్నారు. ఈ ఉత్తర్వులు న్యాయచరిత్రలో మాయని మచ్చ అవుతాయని, ఏసీబీ కోర్టు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు అర్థంలేదని అన్నారు.
ఏసీబీ కోర్టు జడ్జిపై పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం న్యాయవ్యవస్థను కోరాలనుకొంటున్నట్టు ఏజీ తెలిపారు. ఒక ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇస్తామని ఎర వేసిన కేసు ప్రాథమిక దశలోనే నిందితులకు క్లీన్చిట్ మాదిరిగా ఏసీబీ కోర్టు మెమో ను రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. దర్యాప్తు పూర్తి కాకుండా, చార్జిషీట్ దాఖలు చేయకుండానే ఈ తరహా ఉత్తర్వులు మనుగడలో ఉంచడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద అసాధారణ అధికారాలున్నప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా క్రిమినల్ కేసుల దర్యాప్తును నిలుపుదల చేయవని అన్నారు. మెమో ప్రకారం నిందితులుగా చేర్చేందుకు అర్హులు కానప్పుడు గతంలో ఇదే కేసులో ముగ్గురు నిందితులను ఎలా రిమాండ్కు పంపుతారని ఏజీ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదని చెప్పి కేసు నుంచి తప్పించుకోవాలని అనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. ఆధారాలు లభించాకే మెమో దాఖలు చేశామన్నారు.
అంతర్రాష్ట్ర కేసులను విచారించొచ్చు
సిట్ దాఖలు చేసిన మెమోను రద్దు చేసిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు ఎలా పంపిందని హైకోర్టు ప్రశ్నించింది. మరో సందర్భంలో మెమో దాఖలు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు ఏకపక్షంగా ఉన్నందునే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని న్యాయవాది ఎన్ రామచందర్రావు అనగా.. రాష్ట్ర పోలీసులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేసే అధికారం ఉన్నదని ధర్మాసనం గుర్తు చేసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున ప్రకటించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనిదే..
మొయినాబాద్ పోలీస్స్టేషన్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలోకి రాదని, ఇలాంటప్పుడు నోటిఫై చేయకపోవడం చట్ట వ్యతిరేకమన్న న్యాయవాది శ్రీనివాస్ తరఫు సీనియర్ అడ్వకేట్ ఎన్.రామచందర్రావు వాదనను ఏజీ తోసిపుచ్చారు. మొయినాబాద్ పీఎస్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నదని అన్నారు.