వినాయక నగర్, నవంబర్ 19 : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ విభాగాలలో తమ పనుల నిమిత్తం జనాలతో హడావిడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు వచ్చి నేరుగా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో ఏం జరిగిందోనని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురు సిబ్బంది పై పలు ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాగా, టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ బృందం ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తనిఖీల అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారి పేర్కొన్నారు.