ఇల్లెందు, జనవరి 9 : ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో సంధ్యారాణి ఆగస్టు నుంచి కాంట్రాక్టు తెలు గు టీచర్గా పనిచేస్తున్నది.
ఆమెకు సంబంధించి నాలుగు నెలల జీతాల బిల్లు చేయడానికి ఆ పాఠశాల ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో మొదటగా రూ.2 వేలు ఇస్తానని ఒప్పుకున్న సంధ్యారాణి తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి పథకం ప్రకారం గురువారం ఉదయం ప్రిన్సిపాల్ కృష్ణకు ఉపాధ్యాయురాలు రూ.2 వేలు లంచం ఇవ్వగా.. ఆ డబ్బులు అటెండర్ రామకృష్ణకు ఇవ్వాలని సూచించాడు. దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.