చారకొండ, ఏప్రిల్ 28 : నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీందర్ మాతృ భూమి డెవలపర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సదరు సంస్థ యజమాని శ్రీపతిరావు నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం శేరిఅప్పారెడ్డిపల్లి శివారులో 12 ఎకరాలను కొనుగోలు చేశాడు. సదరు భూమిని 12 మందికి విక్రయించగా.. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఫిబ్రవరి 7న రవీందర్ స్లాట్ బుక్ చేశాడు.
రిజిస్ట్రేషన్ చేయాలని అదే నెల 14వ తేదీ వరకు తాసీల్దార్ నాగమణిని సంప్రదించాడు. ఒక్కో డాక్యుమెంట్కు రూ.25 వేల చొప్పున రూ.3 లక్షలు ఇవ్వాలని తాసీల్దార్ డిమాండ్ చేసింది. మొదటి విడతలో నాలుగు డాక్యుమెంట్లను ఫిబ్రవరి 20న రిజిస్ట్రేషన్ చేశారు. వాటికి సంబంధించిన రూ.లక్ష ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. రవీందర్.. శుక్రవారం రూ.75 వేలు తీసుకొని తాసీల్దార్ వద్దకు వెళ్లాడు. సదరు మొత్తాన్ని వీఆర్ఏ వందన భర్త వెంకటయ్యకు ఇచ్చి.. మిగతా రూ.25 వేలు ఆపరేటర్ రాజుకు ఇవ్వాలని సూచించింది. రవీందర్ డబ్బును వెంకటయ్యకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పంచనామా చేసిన అధికారులు తాసీల్దార్ నాగమణి, వీఆర్ఏ భర్త వెంకటయ్య, ఆపరేటర్ రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.