సంగారెడ్డి కలెక్టరేట్ /మేడ్చల్/సారంగాపూర్, మార్చి 24: లంచం తీసుకుంటూ రెండు చోట్ల ముగ్గురు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలో డీఈవో, సీనియర్ అసిస్టెంట్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ, జగిత్యాల జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు దొరికారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలను స్టేట్ నుంచి సెంట్రల్ సిలబస్ (సీబీఎస్ఈ)కు మార్చుకునేందుకు ఈనెల 15న డీఈవోను కలిసింది. అందుకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి ఎన్వోసీ ఇవ్వాలని సదరు పాఠశాల ప్రతినిధులు డీఈవోను కోరారు. ఇందుకు డీఈవో రూ.1.10 లక్షలు లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్ట్టెంట్ రామకృష్ణతో బేరసారాలు సాగించాడు. మొదటి విడతగా సదరు ప్రతినిధులు శుక్రవారం రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు డీఈవో రమేశ్, అసిస్టెంట్ రామకృష్ణలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సంగారెడ్డితోపాటు మేడ్చల్లోని డీఈవో రాజేశ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కొంత నగదు, బంగారం, వెండి, ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు దొరికినట్టు తెలిసింది. శనివారం రాజేశ్కు సంబంధించిన బ్యాంక్ లాకర్లు తెరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన సర్పంచ్ జయ భర్త లక్ష్మారెడ్డి గ్రామంలోని తుర్కాసీకాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన చెక్కు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మిని కోరగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసింది. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో లక్ష్మారెడ్డి నుంచి విజయలక్ష్మి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ పట్టుకున్నారు.