కరీంనగర్ విద్యానగర్, మార్చి 18 : అక్రమార్జనకు పాల్పడుతూ ఒక బెల్లం వ్యాపారి నుంచి తరచూ లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు బినామీగా వ్యవహరిస్తున్న అతడి స్నేహితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జకని వేణును కూడా అరెస్ట్ చేశారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రాము వేములవాడలో పనిచేసిన సమయంలో (2022 నుంచి 2024 వరకు) ఒక బెల్లం వ్యాపారి నుంచి క్రమం తప్పకుండా యూపీఐ లావాదేవీల ద్వారా లంచం తీసుకున్నాడు. మొదట తన స్నేహితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జకని వేణు ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించి, ఆ తర్వాత తన తండ్రి ఖాతాకు పంపించుకునేవాడు.
ఈ విషయమై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ కరీంనగర్లోని సీఐ ఇంట్లో సోదాలు చేశారు. బ్యాకు ఖాతా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అంతేగాక సీఐ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.20 లక్షల నగదు గుర్తించారు. వాటికి లెకచూపక పోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రాముతోపాటు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అతడి స్నేహితుడు వేణును అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.