హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. కోర్సుల్లో అవసరమైన మార్పులు తెచ్చేందుకు వర్సిటీలు, ఉన్నత విద్యామండలికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి, టీసీఎస్ అయాన్, టీఎస్ ఆన్లైన్ సం యుక్తంగా ‘ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు అగ్మెంట్ ఎంప్లాయబిలిటీ’ అంశంపై హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన సెమినార్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా.. ఎంత చదివినా, అంతిమంగా ఉద్యోగాలు సాధించేలా కోర్సులుండాలన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు చేతిలో పట్టుకొని కోటి ఆశలతో బయటికెళుతున్నారని, కాని అందరూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్రం ముందున్నదని చెప్పారు. ఎనిమిదేండ్లలో 17 వేలకు పైగా పరిశ్రమలు రాగా, 15 లక్షల ఉద్యోగావకాశాల లభించాయని గుర్తుచేశారు. కొత్తగా 1,500కు పైగా ఐటీ కంపెనీలు రాష్ర్టానికి రాగా, 7 లక్షల మంది ఉద్యోగులు ఈ రం గంలో పనిచేస్తున్నారని వివరించారు. పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానించాలని, ఈ దిశగా రోడ్మ్యాప్ను రూపొందించి అమలుచేయాలని సూచించారు.
బిట్స్ క్యాంపస్ ఆదర్శం
ఇంటర్న్షిప్ అమల్లో హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్ను ఆదర్శంగా తీసుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ సూచించారు. నిరంతరం ఇంటర్న్షిప్, ఆంత్రప్రెన్యూర్, ఫ్యాకల్టీ ఓరియంటేషన్ను నిర్వహించడంతోనే విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధం చేయగలమని చెప్పారు. సెలవులొచ్చాయంటే కొందరు విద్యార్థులు ఇం డ్లలో కుటుంబ సభ్యులతో గడపకుండా.. పరిశ్రమ వర్గాలతో అనుసంధానమయ్యేందుకు, ఇంటర్న్షిప్లు వెతుక్కొంటున్నారని, మన విద్యార్థులు సైతం ఈ దిశగా ఆలోచించాలని సూచించారు.
అందుబాటులో కొత్త కోర్సులు
రాష్ట్రంలో ఎంప్లాయబిలిటీ కోర్సులను క్ర మంగా అందుబాటులోకి తెస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. బీఎస్సీ బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డాటా సైన్స్, బీఏ ఆనర్స్ వంటి కోర్సులను తీసుకొస్తున్నట్టు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ మన దగ్గరున్న కరికులం 20 ఏండ్ల క్రితంనాటిదని, దీనిని పూర్తిగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, టీసీఎస్ కంట్రీ మార్కెట్ హెడ్ గోపాలక్రిష్ణ జీఎస్ఎస్, పలు వర్సిటీల వీసీలు కట్టా నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డి, రవీందర్, లక్ష్మీకాంత్రాథోడ్, రవీందర్గుప్తా, మల్లేశ్ పాల్గొన్నారు.