హైదరాబాద్ : కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఆసరా(Aasara) పెన్షన్ కార్డులను, డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల(Double bed room) మంజూరు, దళిత బంధు(Dalita Bandu) తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో ఆసరా కార్డులను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు విచారణ జరిపి అర్హులకు మంజూరు చేయాలని చెప్పారు. పెన్షన్ల సమస్య సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. దళితు బంధు కింద నియోజకవర్గ పరిధిలో వందమంది లబ్ధిదారులకు అందించిన యూనిట్లు ఉన్నాయా, సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించాలని వివరించారు.
రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. లబ్ధిదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే యూనిట్ లను ఎంపిక చేసుకొనే విధంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి బోర్ వెల్స్ ఏర్పాటు చేస్తున్నా వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీవో వసంత, తాసీల్దార్లు శైలజ, విష్ణు సాగర్, అన్వర్ హుస్సేన్, అయ్యప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి పాల్గొన్నారు.