హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పంద్రాగస్టు నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం నెలాఖరు వరకు కొనసాగనున్నది. లబ్ధిదారులకు ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కొత్త కార్డులను ఆయా జిల్లాలకు తరలించారు.
ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, కొత్తవారితో కలిపి ఈ సంఖ్య 45.41 లక్షలకు పెరుగుతున్నది. రాష్ట్రంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందజేస్తున్నది. తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆ క్యాటగిరీకి చెందిన దాదాపు 12 వేల మంది లబ్ధిపొందనున్నారు. దీంతో ఆసరా పెన్షన్లు పొందుతున్న క్యాటగిరీల సంఖ్య పదికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపుగా రూ.12 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నది.