హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం 35.95 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉండగా.. ఈ నెల నుంచి వారి సంఖ్య 46 లక్షలకు చేరనున్నది. కొత్తగా మరో 10లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇవ్వనున్నది. ఈ నెల 15 నుంచి పంపిణీ చేయనున్న ఈ పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.200 కోట్లకు పైగా అదనంగా చెల్లించనున్నది. ఇప్పటికే ప్రతినెలా రూ.800 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. పెరిగిన పింఛన్లతో కలిపి ఇకపై రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆసరా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నది. ఇకపై లబ్ధిదారుల ఖాతాల్లో వార్షికంగా 12వేల కోట్ల వరకు ప్రభుత్వం జమ చేయనున్నది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పింఛన్లతో కలిపి లబ్ధిదారులందరికీ బార్కోడ్తో కూడిన పాస్పుస్తకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి వాటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు వాటిని అందివ్వనున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 10 రకాల క్యాటగిరీల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. తాజాగా డయాలసిస్ పేషంట్లకు ఇవ్వాలని నిర్ణయించడంతో.. 10 రకాల క్యాటగిరీల వారికి ఆసరా పింఛన్లు అందనున్నాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల మంది వరకు డయాలసిస్ పేషంట్లు ఉన్నారని అంచనా. వీరికి ఇప్పుడు కల్పిస్తున్న సౌకర్యాలను కొనసాగిస్తూనే.. అదనంగా రూ.2016 నెలవారీ పింఛను అందజేయనున్నారు.
బీడీ కార్మికులు దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ర్టాల్లో ఉన్నా.. ఏ ఒక్క రాష్ట్రంలోనూ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడంలేదు. ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, నేత, గీత కార్మికులకు పింఛను ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. టీఆర్ఎస్ ప్రభు త్వం రెండోసారి అధికారంలోకి వస్తే 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పింఛను ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు రాబడులు తగ్గిన ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహకారం బంద్ చేసి గందరగోళ పర్చింది. అయినప్పటికీ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వారికి పింఛను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.