చేగుంట, జనవరి 4: పాతకక్షలను దృష్టిలోపెట్టుకొని ఓ వ్యక్తి కారుతో పెండ్లిబృందాన్ని ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన వడ్డె వెంకటి కుతూరు స్వాతి వివాహం గురువారం జరిగింది. సాయంత్రం పెండ్లికూతురిని అత్తగారి ఇంటికి సాగనంపే సమయంలో ఉప్పు స్వామితోపాటు పలువురు కులస్థులు ఉన్నారు.
ఉప్పు స్వామికి వడ్డె నరేందర్కు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో స్వామి కుటుంబ సభ్యులు పెండ్లి బృందంలో ఉన్నారు. దీంతో వడ్డె నరేందర్ కారు నడుపుతూ పెండ్లి బృందంపైకి తోలడంతో ఉప్పు రమ్య (20), ఉప్పు దుర్గయ్య, సంపంగి యాదగిరి, ఉప్పు సుజాత, బబ్బుకు గాయాలయ్యాయి. అదే సమయంలో భీంరావ్పల్లికి చెందిన కాపు యాదగిరి బైక్పైకి దూసుకెళ్లడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన దుర్గయ్యను కామారెడ్డి దవాఖానకు తరలించారు. హైదరాబాద్కు తరలిస్తున్న రమ్య మార్గమధ్యంలో మృతి చెందింది. మరి కొందరిని నార్సింగి దవాఖానకు తరలించారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.