ఖమ్మం రూరల్, మార్చి 18 : ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. తెల్దార్పల్లికి చెందిన ఉన్నం భవాని(25) పీజీ వరకు చదువుకున్నది. కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోడంతో ఇక తనకు ఉద్యోగం రాదేమోననే బెంగతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో మంగళవారం ఉదయం ఇంట్లో గడ్డిమందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. చేసేదేమీలేక కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్టు తెలిపారు.