కొత్తకోట, అక్టోబర్ 25 : ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన దాసరి శేఖర్ (32) వృత్తిరీత్యా డ్రైవర్. నాలుగు నెలల కిందట అతడి సెల్ఫోన్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి.. ‘లోన్ కావాలంటే మేం ఓ లింక్ పంపుతున్నాం.. డౌన్లోడ్ చేసుకోవాలి’ అని చెప్పాడు. వెంటనే ఫోన్కు లింక్ రావడంతో క్లిక్ చేశాడు.
లోన్ యాప్ గురించి సరిగ్గా తెలియకపోవడంతో వారు అడిగిన వివరాలను యాడ్ చేసి, రూ.2 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని వారం రోజు ల్లో చెల్లించాడు. శేఖర్కు డబ్బు అవసరం లేకపోయినా యాప్ నిర్వాహకులు అతడి ఖాతాలో రూ.2,500 జమ చేశారు. ఆ డబ్బును కూడా తిరిగి చెల్లించాడు. అంతటితో ఆగని యాప్ నిర్వాహకులు అతడి ఫోన్ హ్యాక్ చేసి.. శేఖర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అతడి స్నేహితుడి భార్యకు, కుటుంబ సభ్యులకు అశ్లీల చిత్రాలను పంపారు. వేధింపులను తట్టుకోలేక శేఖర్ రూ.30 వేలకుపైగా చెల్లించాడు. అయినా ఒత్తిళ్లు ఆగకపోవడంతో అవమానానికి గురైన శేఖర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.