కొత్తగూడెం క్రైం, జనవరి 26 : ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టుకు ఓ జవాన్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. చిందౌలా అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు సంచరిస్తున్నట్టు తెలుసుకొన్న డీఆర్జీ సూపర్-30 బృందం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. మూడు రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఘటనా స్థలంలో బుల్లెట్ గాయంతో బాధపడుతున్న ఓ మహిళా మావోయిస్టును గుర్తించారు. జవాన్లు వెంటనే ఆమెను ప్రత్యేక వాహనంలో గరియాబంద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మావోయిస్టుకు రక్తం అత్యవసరం కావడంతో శుక్రవారం ప్రదీప్ సిన్హా అనే హెడ్కానిస్టేబుల్ స్పందించి రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. సదరు మావోయిస్టును బీజాపూర్ జిల్లా సిల్గేర్ గ్రామానికి చెందిన పార్వతిగా గుర్తించారు. మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసిన హెడ్కానిస్టేబుల్ను అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.