వెల్దుర్తి, మార్చి 12: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి ‘వరండాలో గర్భిణి ప్రసవం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి చందూనాయక్ స్పందించారు. జిల్లా అదనపు డీఎంహెచ్వో విజయనిర్మల, డిప్యూటీ డీఎంహెచ్వో అరుణశ్రీకి విచారణ బాధ్యతను అప్పగించారు.
వారు మంగళవారం వెల్దుర్తి ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. రాత్రి విధుల్లో ఉన్న ఏఎన్ఎం జయంతితోపాటు దవాఖాన డాక్టర్ సౌజన్యతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరండాలో ప్రసవం జరగడానికి గల కారణాలు, విధుల్లో నిర్లక్ష్యంపై వారు ఆరా తీశారు. రాత్రివేళల్లో ఇద్దరు సిబ్బంది ఉండేలా షెడ్యూల్ను రూపొందించామని పేర్కొన్నారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దవాఖానలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.