న్యూయార్క్, జూన్ 19: ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆహార సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నది. ఈ యుద్ధం వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి శరాఘాతంలా పరిణమించింది. ఫలితంగా ప్రపంచమంతటా ఆహార ధరలు రికార్డు స్థాయికి చేరి ద్రవ్యోల్బణం నానాటికీ అధికమవుతున్నది. ప్రపంచానికి అత్యధిక స్థాయిలో ఆహార ధాన్యాలను, వంట నూనెలను అందించే దేశాల్లో ఒకటైన ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగడంతో ఆ దేశం నుంచి ఎగుమతులు దారుణంగా క్షీణించాయి. ఇది పలు దేశాలను కలవరపెడుతున్నది. సొంత నిల్వలు తగ్గిపోతాయన్న భయంతో కొన్ని దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను తగ్గిస్తున్నాయి.
అల్పాదాయ దేశాలకు శరఘాతమే..
ఒకవైపు ఎరువుల ధరలు భారీగా పెరగడం, వాతావరణ సమస్యలు వ్యవసాయ ఉత్పత్తిదారులను వేధిస్తుంటే.. మరోవైపు అమెరికా, మొరాకో లాంటి దేశాల్లో క్షామం గోధుమ పంటను దెబ్బతీసింది. ఇలాంటి విపత్కరాలన్నీ కలిసి ఆహార సంక్షోభాన్ని ఎగదోస్తున్నాయి. ఫలితంగా గత నెలలో ఐక్యరాజ్య సమితి ఆహార సూచీ 1% కంటే దిగువకు క్షీణించి దాదాపు ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరువైంది. వాస్తవానికి ఈ క్షీణత చాలా చిన్నదేనని, అయినప్పటికీ ప్రస్తుతం ఆహార ధరలు చాలా అధికంగా ఉండటం ఆందోళనకరమేనని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్ఏవో) నిపుణులు అంటున్నారు. ఇది ఆహార లోటుతో సతమతమవుతున్న అల్పాదాయ దేశాలను తీవ్రంగా కుంగదీస్తుందని హెచ్చరిస్తున్నారు.
సొంత నిల్వలు తగ్గుతాయన్న భయంతో..
ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని పలు దేశాలు తమ స్వప్రయోజనాల కోసం రక్షణాత్మక ధోరణులను అవలంబిస్తున్నాయి. ప్రపంచానికి అత్యధిక మొత్తంలో పామాయిల్ను అందిస్తున్న ఇండోనేషియా.. ప్రస్తుతం తమ సొంత ఆహార నిల్వలు తగ్గిపోతాయన్న భయంతో ఇతర దేశాలకు అమ్మకాలను భారీగా తగ్గించింది. మరోవైపు సెర్బియా, కజకిస్థాన్ లాంటి దేశాలు ధాన్యం ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. ఇదేవిధంగా గోధుమ ఎగుమతులను కుదించుకొనేందుకు భారత్ కసరత్తు చేస్తున్నది. ఈ చర్యల వల్ల ఆయా దేశాల్లోని వినియోగదారులు లాభపడినప్పటికీ ఇతర దేశాల్లోని జనం మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఇలాంటి వాణిజ్య ధోరణులు ఆహార నిల్వల లభ్యతపై అదనపు భారాన్ని మోపి ధరలను ఎగదోయడంతోపాటు అంతిమంగా పేదల ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తాయని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధాన ఆహార పదార్థాల ధరలు తగ్గినా..
ప్రస్తుతం వంట నూనెలు, ధాన్యంతోపాటు ప్రధాన ఆహార పదార్థాల ధరలు తగ్గినప్పటికీ మాంసం, పాల ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయని ఎఫ్ఏవో ధ్రువీకరించింది. మార్చిలో వీటి ధరల స్థాయి ఏకంగా 13% పెరిగింది. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదల. ప్రస్తుతం ఇది 2008-11 మధ్య కాలంలో ప్రపంచ ఆహార సంక్షోభానికి దారితీసిన స్థాయికి చేరువగా ఉన్నది. వంట నూనెలకు గత నెలలో డిమాండ్ తగ్గుదల వల్ల ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఇండోనేషియా నుంచి పామాయిల్ సరఫరాపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతున్నది.
అప్పటి వరకూ ధరల మోతే..
ఆహార ధరల పెరుగుదల భారాన్ని మోయలేక ఇప్పటికే శ్రీలంక నుంచి పెరూ వరకు సతమతమవుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరల మంటతో టర్కీలో ద్రవ్యోల్బణం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ప్రస్తుతం సరఫరాల వ్యవస్థలో కొనసాగుతున్న అవరోధాలు తొలగిపోయి ఎగుమతులు పూర్వస్థాయికి చేరే వరకూ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని రిటైల్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 12 నెలల్లోనే ప్రపంచ ఆహార అభద్రతా సూచీ 25% పెరిగింది. ఈ ఏడాదిలో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని జీఎన్ఎఫ్సీ (గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఫుడ్ క్రైసిస్) ఇటీవల స్పష్టం చేసింది.