హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానాలపై బలపరీక్ష కోసం రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు) సమావేశాలను నిర్వహించవచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. ఈ అంశంపై మార్చి 12న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీపీ అధ్యక్షుడు రవీందర్గౌడ్ దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టి స్ అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఆర్డీవోలు అవిశ్వా స నోటీసులు జారీ చేయడం చెల్లదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభు త్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. జిల్లా కలెక్ట ర్ తర్వాత, ఆర్డీవో, సబ్కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్లు ఒకే క్యాటగిరీ కిందకు వస్తారని, అవిశ్వాసాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నోటీసు లు జారీచేసే అధికారం వారికి ఉంటుందని వివరించారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన ద్విసభ్య ధర్మాసనం.. రవీందర్గౌడ్ అప్పీల్ను కొట్టివేసింది.