Sangareddy | సంగారెడ్డి : భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాకు చెందిన ఓ 37 ఏండ్ల మహిళ తన భర్తతో కలిసి.. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కాలినడకన అనంతపూర్ జిల్లాలోని నేరడిగొండకు వెళ్లింది. శుక్రవారం రాత్రి సంగారెడ్డికి తిరిగొచ్చారు దంపతులు. అయితే ఇక రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకుందామని సంగారెడ్డి రూరల్ పీఎస్ పరిధిలోని పసల్వాడీ వద్ద ఉన్న ఆలయంలో బస చేశారు.
అక్కడే ఉన్న ఓ యువకుడు.. ఆ గిరిజన మహిళపై కన్నేశాడు. భర్తపై రాళ్లతో దాడి చేసి ఆమెను సమీపంలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ దుండగుడు పారిపోయాడు. దంపతులు 100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దంపతులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన మాధవన్గా గుర్తించారు. కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం సంగారెడ్డికి మాధవన్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఇక్కడ పెయింటర్గా పని చేస్తున్నాడు. ఇక నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.