Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): బీసీల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా విశేష కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే 138 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 2023-24 విద్యాసంవత్సరానికి మరో 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానున్నది.
స్వరాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచేందుకు సీఎం కేసీఆర్ 2016-17లో 4.. 2017-18లో 119.. 2018-19లో మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పారు. వాటిలో తొలుత 5,6,7 తరగుతుల్లో విద్యార్థులకు ప్రవేశాలను కల్పించిన ప్రభుత్వం.. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వస్తున్నది. దీంతో బీసీలకు మొత్తంగా 261 గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలు మినహా మిగిలిన 255 గురుకుల కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లను కల్పించనున్నారు. వీటిలో 130 బాలుర, 125 బాలికల కళాశాలలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న 138 బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 21,680 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ విద్య అందుతున్నది. కొత్తగా అప్గ్రేడ్ చేసిన 119 గురుకుల పాఠశాలల్లో మరో 15,600 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో బీసీ గురుకుల కళాశాలల సంఖ్యను పెంచడంతోపాటు ప్రభుత్వం నూతన కోర్సులను ప్రవేశపెట్టింది. ఇంటర్మీడియట్లో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ గురుకుల కాలేజీల్లో మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ కోర్సులను ప్రవేశపెట్టింది.
2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 255 బీసీ జూనియర్ కళాశాలలతోపాటు అగ్రికల్చర్ మినహా మిగిలిన 14 గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. సోమవారం నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040-23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
బీసీల విద్యాభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు. గురుకులాల ద్వారా పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఆయన మార్గనిర్దేశం మేరకు బీసీ గురుకుల పాఠశాలలను క్రమంగా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈ ఏడాది మరో 119 పాఠశాలలను అప్గ్రేడ్ చేయడంతో బీసీలకు మొత్తంగా 255 గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పలు కొత్త కోర్సులనూ ప్రవేశపెడుతున్నాం. ఈ అవకాశాన్ని బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి