హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా చేగూరులో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మూడురోజుల పాటు ‘అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ అండ్ మెడిసిన్ ’ (బయోమీ23) పేరిట నిర్వహించిన సదస్సు గురువారం ముగిసింది. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి 14 మంది వక్తలు, బయోసైన్సెస్, ఫార్మసీ రంగాల అధ్యాపకులు, పలు వర్సిటీలు, గురుకులాల విద్యార్థులు, దాదాపు 750 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. గురువారం సదస్సులో వైద్యరంగంలో జీవశాస్త్ర పురోగతిపై వక్తలు విస్తృతంగా చర్చించారు.
అదేవిధంగా, వ్యాక్సిన్లు వాటి సామర్థ్యం, కొత్త వైరస్ రకాలు, కొవిడ్ సవాళ్లపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి ప్రసంగించారు. జీ20 సమ్మిట్లో ప్రతిపాదించిన వన్ హెల్త్ అంశంపై టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అవగాహన కల్పించారు. అనంతరం పరిశోధకులకు సర్టిఫికెట్లు, అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకొన్నాయి.