బోయినపల్లి, మే 6 : అశ్రునయనాల మధ్య ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో ముగిసాయి. గురువారం జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసిన అనిల్ (29) భౌతికకాయం శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చేరింది. తొలుత కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఎక్స్ రోడ్డు నుంచి ఆర్మీకి చెందిన వాహనంలో అనిల్ భౌతికకాయాన్ని అశేష జనవాహిని మధ్య భారీ బైక్ ర్యాలీ మధ్యన మల్కాపూర్కు తీసుకువచ్చారు. భౌతికకాయం చేరుకోగానే అనిల్ తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్య, భార్య సౌజన్య, కుమారులు అయాన్, ఆరవ్ బోరునవిలపించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
ప్రముఖుల నివాళి..
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కలెక్టర్ అనురాగ్ జయం తి, ఎస్పీ అఖిల్ మహజన్, ఆర్మీ మేజర్ పర ష్ సమంత్ తదితరులు మల్కాపూర్కు చేరుకొని అనిల్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం చేశారు. అనంతరం అశేష జనవాహిని మధ్య అనిల్ వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. పార్థివ దేహంపై ఉన్న జాతీయ జెండాను, ఆర్మీ యూనిఫాంను ఆయన సతీమణి సౌజన్యకు ఆర్మీ అధికారి అందించారు.
ఆయన భార్య సౌజన్య జాతీయ జెండాతోపాటు, యూనిఫామ్ను హత్తుకొని విలపించారు. అనంతరం అనిల్ పార్థివ దేహాన్ని చూపించగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 నిమిషాలు మృతదేహంపై పడి విలపించారు. అనిల్ పెద్ద కొడు కు అయాన్ తండ్రి చితికి నిప్పంటించగా, ఆర్మీ అధికారులు గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, ప్రేమ్సాగర్రావు, జిల్లా నాయకులు చెన్నాడి అమిత్కుమార్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.