హైదరాబాద్, మార్చి31 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల లా కాలేజీ విద్యార్థి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను కనబరిచి, అత్యుత్తమ అవార్డు అందుకొన్నారు. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రిసెర్చ్ అసోసియేషన్, పలు విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా బ్యాంకాక్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సంగారెడ్డి గురుకుల న్యాయవిద్య కాలేజీలో నాల్గోసంవత్సరం చదువుతున్న విద్యార్థి మిట్టకడప తిరుపతి పాల్గొన్నారు.
‘ఏ క్రిటికల్ స్టడీ- ద లా కమిషన్ అండ్ ఇట్స్ లీగల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ అనే పేపర్ను ప్రజెంట్ చేశారు. ఇందుకు, తిరుపతి బెస్ట్ ఓరల్ ప్రజెంటేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో విద్యార్థికి ఆ అవార్డు అందజేసి అభినందించారు. విద్యార్థికి అవార్డు దక్కడంపై గురుకుల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపారు.