నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ ఇప్పటికి 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చివేసింది. తనకు ఏమాత్రం బలంలేని రాష్ర్టాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలను కలుపుకొని, చీల్చి, ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకొని అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోనూ అలాంటి కుట్రే పన్నినా.. ఎందుకు ఎదురు దెబ్బతిన్నది? బోనులో ఎందుకు దోషిగా నిలబడింది? చెడకుట్ట వచ్చిన తేలును చెప్పుతో కొట్టినట్టు బీజేపీ అసలు స్వరూపాన్ని సమాజం ముందు నిలబెట్టిందెవరు? దానికి కారణం ఏమిటి? అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిబద్ధత. పార్టీ నాయకత్వం పట్ల నియమబద్ధత. తెలంగాణ సమాజం పట్ల కర్తవ్యబద్ధత.
కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు నేర్చుకొన్న వ్యూహరచనా చాతుర్యం, వలపన్ని పట్టుకొనే నైపుణ్యం, పార్టీ నాయకత్వం డైరెక్షన్లో ఒక ఆపరేషన్ని మూడో కంటికి తెలియకుండా నిగూఢంగా నిర్వహించగల నేర్పు బీజేపీకి గింగిరాలు తిరిగేలా చేసింది. తెలంగాణ ఏర్పడినప్పుడే పలు వైపుల నుంచి వచ్చే కుట్రలు, కుహకాల గురించి కేసీఆర్ ఊహించారు. ఆ మేరకు ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడమే కాదు; ప్రత్యర్థుల పన్నాగాలను ఎలా ఎదుర్కొనాలనే విషయంలో వారిని పూర్తిగా సన్నద్ధులను చేసి ఉంచారు. అంతే కమిట్మెంట్తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమష్టి వ్యూహంతో నడుస్తూ, అదును చూసి దెబ్బతీయడానికి కాచుకొని ఉంటారు. బీజేపీ బేరసారాల పన్నాగాలు విఫలమవడానికి ఎమ్మెల్యేల్లో ఉండే ఈ నిగూఢ యుద్ధ చాతుర్యమే కారణం.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): చీమచిటుక్కుమన్నా సరే.. సార్కు చెప్పుడే అని ఎమ్మెల్యేలు నియమంగా పెట్టుకోవటం వల్లే బయటి శక్తుల కుట్రలు చిత్తవుతున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేలా చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విచ్ఛి న్నం చేయాలని బయటి శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా క్రమశిక్షణ గల నాయకులుగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వ్యవహరిస్తున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటుకు నోటుతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని నాడు చంద్రబాబు కుట్రపన్నినా.. వందల కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వా న్ని కూలదోయాలని స్వామీజీల రూపంలో మోదీ, అమిత్షాలు విష పన్నాగం పన్నినా వా టిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తుత్తునియలు చేశారు. కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మణిపూర్ రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలు అమ్ముడుపో యి ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అధికారం చేపట్టిన బీజేపీ.. తెలంగాణను తమ తరువాతి కార్యక్షేత్రంగా ఎంచుకొన్నది. బీజేపీ మోసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే పసిగట్టారు. బీజేపీ చేస్తున్న ప్రలోభాలను పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెవిలో వేస్తూనే ఉన్నారు. ‘క్యాషా’య స్వాములుగా మారిన పీఠాధిపతులు సింహయాజి, రామచంద్రభారతి, మధ్యవర్తి నందులను ముందు పెట్టి బీజేపీ వెనక ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోట్ల కట్టలతో పడగొట్టాలని పథకం వేశారు. కానీ, కుట్రలు చేస్తున్న కమలం పార్టీకి తెలంగాణాలో సందు దొరకనివ్వలేదు. మా జోలికి వస్తే చెప్పుతో కొడ్తామన్నట్టుగా ఎమ్మెల్యేలు వ్యవహరించారు. తమతో పీఠాధిపతులు బేరసారాలు చేస్తున్నారని గ్రహించిన వెంటనే ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావు ఆ సమాచారాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు చేరవేశారు. గద్ద నుంచి తల్లి కోడి తన పిల్లలను రక్షించుకున్నట్టే ఒకవైపు ఎమ్మెల్యేలను.. మరోవైపు తెలంగాణను రక్షించుకోకపోతే రాష్ట్ర అస్తిత్వానికే భంగం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ మెరుపు వేగంతో ప్రతి వ్యూహాన్ని రచించారు. తీగలాగితే డొంకంత కదిలినట్టు సీఎం పక్కా ప్రణాళికతో ప్రత్యర్థుల ఆటలను కట్టించారు.
ముందే హెచ్చరించిన సీఎం..
రాష్ట్రంలో బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి పలువురు నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దొరికిన స్వామీజీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు.. ఇతర నేతలతో సంప్రదింపులు జరిపారు. పదుల సంఖ్యలో నేతలను కలిశారు. ఎక్కడికక్కడ సమాచారం ఎవరికివారే సీఎంకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు చేరవేశారు. వచ్చే సమాచారం ఆధారంగా కుట్రల విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో సీఎం ప్రస్తావించారు. జాగ్రత్తగా ఉండాలని నేతలను హెచ్చరించారు కూడా.
నాడు చంద్రబాబు.. నేడు మోదీ
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయాలని నాడు చంద్రబాబు పన్నిన కుట్రను, రాష్ట్ర ప్రగతిని చూసి కండ్లు కుట్టిన మోదీ విషపు జాడను సీఎం కేసీఆర్ తనదైన వ్యూహంతో తిప్పికొట్టారు. ఈ రెండు సందర్భాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టారు. వ్యక్తిగతంగా తనను ఎన్ని తిట్టినా కేసీఆర్ పట్టించుకోరు.. కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం ఊరుకోరు అనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విష యం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరింత లోతుగా తెలుసు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు తెలంగాణపై ఎంత విశ్వాసంతో ఉంటారో.. సీఎం కేసీఆర్ పట్ల అంతకన్నా రెట్టింపు విధేయతతో ఉంటారని రెండు ప్రధాన సందర్భాల్లో వెలుగుచూశాయి. 2015లో ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు, అప్పటి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రూ. 5 కోట్లతో తనను కొనుగోలు చేయాలని యత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఎల్వీస్ స్టీఫెన్సన్ సీఎం కేసీఆర్కు సమాచారం ఇచ్చారు. ఫలితంగా తెలంగాణపై నాడు చంద్రబాబు పన్నిన కుట్రను కేసీఆర్ బలంగా తిప్పికొట్టారు. నాడు స్టీఫెన్సన్ ప్రదర్శించిన విశ్వాసాన్నే నేడు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి ప్రదర్శించారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినా.. ఒకటి చేసి మాట్లాడినా తమ నాయకుడు, సీఎం కేసీఆర్కు చెప్పకుండా ఉండలేమని నిరూపించారు. ప్రశాంతంగా ఉన్న తమ ఇంట్లోకి దొంగను రానియ్యమనే టీఆర్ఎస్ కుటుంబ ఐక్యతను..తెలంగాణ రాష్ట్ర సమష్టి బాధ్యతను నెరవేర్చారు. టీఆర్ఎస్లో ఎవరిని ముట్టుకున్నా.. ఎవరితో ఏం బేరసారాలు చేసినా.. ఏ లాలూచీ పనులు చేయాలని ప్రయత్నించినా.. అవి సీఎం కేసీఆర్కు క్షణాల్లో తెలిసిపోతాయని ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.