హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): వేసవికాలం పట్ణణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడానికి భూగర్భ జలాలపై ప్రత్యేక దృషి సారించాలని సాగునీటి పారుదల శాఖ అదనపు కార్యదర్శి, భూగర్భ జలశాఖ డైరెక్టర్ శంకర్ సూచించారు. భూగర్భ జలాల నిర్వహణకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన నీటి సంరక్షణ కార్యక్రమాలను పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని కోరారు.
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘గ్రౌండ్ వాటర్ రీచార్జ్, మేనేజ్మెంట్ ఇంన్ అర్బన్ ఏరియాస్’ అనే అశంపై శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పట్టణాల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు డాక్యుమెంటరీలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్-ఆర్డీ జాయింట్ కమిషనర్ శేషుకుమార్, జేడీ కె లక్ష్మ, భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్, ఏడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.