హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటారు. హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
న్యాయవివాదంలో ఉన్న బొటానికల్ గార్డెన్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించుకున్నామని, దానిని దేశంలోనే అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ గార్డెన్ వద్ద విజిటర్స్ కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి, వాకింగ్ సిగ్నల్ ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి, కరీంనగర్ జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్గౌడ్, వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. వీరితోపాటు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఫారెస్ట్ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పెద్దఎత్తున మొక్కలు నాటారు.
నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత ఆమెను ఆలయ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
– అమ్రాబాద్
యాదాద్రి, ఆగస్టు 21: యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో, నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని 38 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ.47,19,956 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.
స్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన భక్తులు నామని బాలరాజు, నాగలక్ష్మి దంపతులు రూ.1,11,111 విరాళం ఇచ్చారు. ఆదివారం ఆలయ ఏఈవో దోర్బాల భాస్కర్శర్మకు విరాళం చెక్కును అందజేశారు.
ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీనగర్లో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు.
– కల్వకుర్తి రూరల్