హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ ప్రకటించారు. క్రిప్టో నేరాలను నిరోధించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించి, శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సోమవారం ఆయన పలువురు ఐపీఎస్ అధికారులతో కలిసి హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వచ్చే నెలాఖరులోగా ఈ సెంటర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, ఐసీసీసీ, నారోటిక్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కొత్తగా 4 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టించినట్టు వివరించారు. సైబర్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఐపీఎస్లు విశ్వజిత్ కంపాటి, కేసీఎస్ రఘువీర్ను అభినందించారు.
ప్రజల భద్రతే లక్ష్యం
సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, వారి భద్రతకు భరోసా ఇవ్వడమే తమ ముందున్న లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్ర సైబర్క్రైం కో-ఆర్డినేషన్ టీమ్, జాతీయ స్థాయిలోని జాయింట్ సైబర్క్రైం కో-ఆర్డినేషన్ టీమ్లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకుని నేరాలను అరికట్టేందుకు కృషిచేయనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో సైబర్ స్కా డ్లకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జా యింట్ సీపీ (అడ్మిన్) పరిమళ హనా నూతన్, ఐపీఎస్లు గజరావు భూపాల్, ఎస్ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.