హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఖాళీ సమయంలో ఇంటి నుంచే పార్ట్టైమ్ ఉద్యోగం చేసి భారీగా డబ్బు సంపాదించవచ్చంటూ కేటుగాళ్లు వేసిన వలలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చిక్కింది. ఇదంతా నిజమేనని భావించిన ఆ యువతి వారు పంపిన ఫోన్నంబర్కు కాల్ చేయడంతో.. యూట్యూబ్లో వీడియోలను లైక్ చేస్తే చాలని, అన్నింటికీ లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. దీనికి ఆశపడి తన బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చిన ఆ యువతి.. తొలుత 3 వీడియోలను లైక్ చేయడంతో ఖాతాలో రూ.150 జమ చేశారు. ఆ తర్వాత 6 వీడియోలను లైక్ చేయడంతో రూ.300 వేసి ఆమెకు నమ్మకం కుదిరేలా చేసిన కేటుగాళ్లు.. ప్రీపెయిడ్ టాస్కులు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని, అందుకోసం పెట్టుబడి పెడితే మంచి లాభం వస్తుందని నమ్మబలికారు. దీంతో తొలుత రూ.1,000 చెల్లించిన ఆ యువతికి తిరిగి రూ.1,600 వచ్చాయి. ఇలా ఆమె విడతలవారీగా ఆ కేటుగాళ్ల బ్యాంకు ఖాతాలకు రూ.19 లక్షలు బదిలీ చేసింది. ఆ సొమ్ముకు లాభం వచ్చినట్టు వారు చూపుతున్నప్పటికీ ఆ డబ్బును డ్రా చేసుకునే అవకాశం లేకపోయింది. దీనిపై ఆమె నిలదీయడంతో సదరు మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12.95 లక్షలు కట్టాలని, లేనిపక్షంలో కట్టిన డబ్బు తిరిగి రాదని కేటుగాళ్లు తేల్చిచెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.