రుద్రంపూర్, జూలై 16: భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో దారుణం జరిగింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన పద్దం భవాని తొలిప్రసవం కోసం బుధవారం ఉదయం 10 గంటలకు రామవరం ఎంసీహెచ్కు వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బెడ్ కేటాయించారు. సాధారణ కాన్పు అయ్యేందుకు ఇంజెక్షన్ ఇచ్చారు.
ఆమె కాలకృత్యాలు వస్తున్నట్టు అనిపించి వెళ్తున్న సమయంలో ఒకసారిగా శిశువు బయటికి వచ్చి కిందపడిపోయింది. నవజాత శిశువుకు స్వల్పగాయాలు కావడంతో అక్కడ ఉన్న గర్భిణులు ఆందోళనకు గురయ్యారు. శిశువు 2.90 కేజీల బరువుతో ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్ఎంవో సాగరిక తెలిపారు. భవానికి సాధారణ ప్రసవం అయ్యేలా చూశామని చెప్పారు. భవానిని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు గురువారం పరామర్శించారు.