చిట్యాల, అక్టోబర్ 19: ఆనందంగా హోటల్ను ప్రారంభించుకుందామనుకున్న రోజే ఆ కుటుంబంలో విషాదం నిండింది. వెంటాడిన దురదృష్టం కుంటుంబంలోని ఇద్దరిని మృత్యు ఒడిలోకి చేర్చింది. మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా మాడ్గుటపల్లికి చెందిన తగుళ్ల వెంకన్న రైల్వే శాఖలో పని చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో అదనపు ఆదాయం కోసం చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై ఇటీవలే ఓ హోటల్ నిర్మించాడు. ఆదివారం హోటల్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఈ నెల 18న తన కుటుంబంతో అక్కడికి చేరుకొని ఏర్పాట్లను పూర్తి చేశాడు. రాత్రి హోటల్లోని ఓ రేకుల గదిలో అతడి తల్లి పార్వతమ్మ, భార్య నాగరాణి(32), కుమారుడు విరాట్ కృష్ణ(7), కూతురు నందినితో కలిసి పడుకున్నారు. హోటల్ నిర్వహణ కోసం అదే గదిపై రేకుల మీద ప్లాస్టిక్ నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున ట్యాంక్ నిండి నీటి బరువుకు రేకులు సహా పడుకున్న వారిపై కూలింది. దీంతో వారు తీవ్ర గాయాలపాలుకావడంతో నార్కట్పల్లి సమీపంలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాణి, విరాట్కృష్ణ మృతి చెందారు. పార్వతమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. నందిని నార్కట్పల్లిలో చికిత్స పొందుతున్నది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వివరించారు.