Gurukula Schools | హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో వరుస ఘటనలకు ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కాసుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అత్తెసరు సరుకులతో ఆహారాన్ని వండిపెడుతుండటం, పర్యవేక్షణ గాలికి వదిలేయటం వల్లే అనారోగ్యానికి గురవుతున్నారని స్పష్టమవుతున్నది. 4 నెలల క్రితం నిర్మల్ జిల్లా ముథోల్ గురుకుల కాలేజీ ఘటనపై కమిటీ ఇచ్చిన నివేదికే సాక్ష్యంగా నిలుస్తున్నది. అయినా సొసైటీ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోకపోవటంతో భువనగిరి పాఠశాల ఘటన పునరావృతమైందని తెలుస్తున్నది.
నిర్మల్ జిల్లా ముథోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో గత జనవరిలో కలుషిత ఆహారం తిని 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో దవాఖాన పాలయ్యారు. ఈ ఘటనపై జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మి నేతృత్వంలో విచారణ కమిటీని సొసైటీ సెక్రటరీ నియమించారు. ఆ కమిటీ ప్రతినిధులు జనవరి 27న క్షేత్రస్థాయిలో పర్యటించి.. వైద్యాధికారులు సూచించిన చర్యలు తీసుకోవటంలో ప్రిన్సిపాళ్లు విఫలమయ్యారని, క్యాంపస్, డార్మెటరీలు, వంటగది ప్రాంతం, డైనింగ్ హాల్ ఆరాలో పరిశుభ్రత లోపించిందని, కొన్ని మరుగుదొడ్లు పనిచేయటం లేదని, చాలా మంది విద్యార్థులుబహిరంగ మలవిసర్జనకు అలవాటు పడుతున్నారని తెలిపారు. పిల్లలు బ్యాక్టీరియా, వైరల్ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరు శాతం తకువగానే ఉన్నా ప్రిన్సిపాల్ అకడమిక్ కార్యకలాపాలను నిర్వర్తించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. రోజువారీ మెనూ ప్రకారం 10.48 ప్యాకెట్లు (524 x 0.020గ్రాముల) స్వీట్ఆయిల్ జారీ చేయాల్సి ఉండగా, అప్పటి కేర్టేకర్ టీజీటీ ప్రేమ్కుమార్ 7 లీటర్లు మాత్రమే జారీ చేశారని, మిగతా 3.48 లీటర్ల నూనెను అప్పటికే వినియోగించినదాన్ని వాడినట్టు గుర్తించామని తెలిపారు. దాని కారణంగానే విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురై ఉండొచ్చని నివేదికలో వెల్లడించారు. కమిటీ ఈ నివేదికను మార్చి 12న సొసైటీకి సమర్పించింది. క్రమశిక్షణ చర్యలు ఎందు కు తీసుకోకూడదో తెలపాలని ప్రిన్సిపాల్, కేర్టేకర్కు ఇటీవలే ఉన్నతాధికారులు మొమో జారీచేశారు తప్ప చర్యలు తీసుకోలేదు.
సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధిత ప్రిన్సిపాలే చీఫ్ వార్డెన్గా కొనసాగుతున్నారు. డిప్యూటీ వార్డెన్తోపాటు, గురుకులంలో సీనియర్ ఉపాధ్యాయుడు కేర్టేకర్గా, మరొకరు అసిస్టెంట్ కేర్టేకర్గా ఉంటున్నారు. మెనూ పాటించడం, నిర్దేశిత నాణ్యత ప్రమాణాల మేరకు సరుకులను వార్డెన్కు అందివ్వడం కేర్టేకర్ బాధ్యత. క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూడటం అసిస్టెంట్ కేర్టేకర్ విధి. అయితే, అందరూ కలిసి నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని తెలుస్తున్నది. డిప్యూటీ వార్డెన్, కేర్టేకర్లు నాసిరకం సరుకులను వాడుతున్నారని, అందులోనూ ప్రిన్సిపాల్స్కు వాటా ఇస్తున్నారని విద్యార్థి, గురుకుల ఉద్యోగ సంఘాలు వెల్లడిస్తున్నాయి. గురుకుల పాఠశాలకు నెలకు రూ.35 వేలు, డిగ్రీ కాలేజీలకు రూ.50 వేల మెయింటెనెన్స్ నిధులు వస్తుంటాయి. ఆ నిధులతో శానిటేషన్, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ, ప్రిన్సిపాళ్లు ఆ పనులేవీ చేయకుండానే బిల్లులు పెట్టి స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
గురుకులాల్లో నిబంధనలు అమలవుతున్నాయా? మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నదా? నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? తదితర అంశాలపై తనిఖీలను నిర్వహించేందుకు సొసైటీ పరిధిలో ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నది. ఆ విభాగం పేరుకే తప్ప, చేసేదేమీ లేదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.