Himanshu | శేరిలింగంపల్లి, జూలై 11: మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూలును తలదన్నేలా తీర్చిదిద్దారు. పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి సర్కారు బడికి జీవం పోశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభిస్తారు.
తాను చదువుకుంటున్న స్కూలు పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూలును హిమాన్షు తన మిత్రులతో కలిసి తరచూ సందర్శించేవారు. ఈ క్రమంలో ఆ పాఠశాలలో కూడా మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్కూలులా తీర్చిదిద్దాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం నిధులు సేకరించి పునరుద్ధరణపనులు చేపట్టారు. రెండు డిజిటల్ తరగతి గదులు సహా మొత్తం 3 క్లాస్ రూములు, బెంచీలు, లైబ్రరీ, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కార్యాలయ ప్రాంగణం, విద్యార్థులకు ప్రత్యేకంగా డైనింగ్హాలు, మరుగుదొడ్లు, వాషింగ్ ఏరియాలను నిర్మించారు. తాగునీటి ఫిల్టర్లు, విద్యార్థులకు ప్రత్యేక క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచారు.