Karimnagar | శంకరపట్నం/ హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామ సర్పంచ్అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురారెడ్డి హుజూరాబాద్ రూరల్ మండలం కనుకులగిద్ద గ్రామ సర్పంచ్ గోపు కొమురారెడ్డి(53) శనివారం తెల్లవారుజామున తన కారులో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు బయల్దేరారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొమురారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కొమురారెడ్డికి భార్య రమ, ఇద్దరు కూతుళ్లు ఉజ్వల, అఖిల ఉన్నారు. కూతుళ్లకు ఇద్దరికి వివాహాలు అయ్యాయి.
భార్య రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంకరపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, కొమురారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎవరికి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరించేవాడని, ముక్కుసూటిగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. కొమురారెడ్డి మృతికి బీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు.