పటాన్చెరు, జూన్ 12: ఆమె అందమైన అమ్మాయి. ఎత్తు నాలుగు అడుగులు. రోగులకు మందులు ఇస్తుంది.. హోటల్లో సేవలూ చేస్తుంది. ఆకట్టుకొనే రూపంతో ఉన్న ఆమె మనిషి అనుకొంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఆమె ఎవరోకాదు మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఫణికుమార్, దుర్గాప్రసాద్ దీనిని ఆవిష్కరించారు. రిమోట్ సంకేతాల ఆధారంగా ఇది తన చేతుల్లోని వస్తువులను చెప్పినవారికి అందజేస్తుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మైత్రిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేసేవారిని రాష్ట్ర ప్రభుత్వం, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కరోనా లాంటి ఆపత్కాల సమయంలో రోగులకు మందులు అందజేసేందుకు ఈ రోబో చక్కగా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. హోటల్ రంగంలోనూ కస్టమర్లకు సేవలందించేందుకు దీనిని వినియోగించుకోవచ్చని చెప్పారు. త్వరలో మాట్లాడే రోబోలను, విని అర్థం చేసుకునే రోబోలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఫణికుమార్ తెలిపారు.