హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి : ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నవదంపతులతో పాటు తల్లితండ్రులు, డ్రైవర్ మృతి చెందారు. శామీర్పేట ఆలియాబాద్కు చెందిన మంత్రి రవికుమార్, భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు బాలకిరణ్(29), ఉదయకిరణ్, సాయికిరణ్తో కలిసి అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో స్థిరపడ్డారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన పెద్ద కుమారుడు బాలకిరణ్కు ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన కావ్యతో ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి జరిగింది.
మార్చి 3న శామీర్పేట తూంకుంటలోని ఓ రిసార్ట్లో రిసెప్షన్ నిర్వహించారు. మార్చి 4న తిరుపతికి వెళ్లి దైవదర్శనం తర్వాత కారులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. ప్రమాదంలో మంత్రి రవీందర్ (50), ఆయన భార్య లక్ష్మి (45), కుమారుడు బాలకిరణ్ (29), కోడలు కావ్యశ్రీ (24)తో పాటు కారు డ్రైవ ర్ అశోక్ (29) మృతి చెందారు. నంద్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.