Rice Miller | మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వనపర్తి (నమస్తే తెలంగాణ), ఫిబ్రవరి 24: ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపుతున్నది. ట్విస్ట్ ఏమిటంటే దొంగసొమ్మును దోపిడీ చేసిన ముఠా వెనుక ఓ మంత్రి ఉన్నారనే ఆరోపణలు రావటమే. ధాన్యం బస్తాలు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ కొందరు పట్టుబడటంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది.
కొన్ని రోజులుగా వనపర్తి జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్ప చెప్పకపోవడంతో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఈ నేపథ్యంలో ఒక జిల్లా అధికారి సోదరుడికి చెందిన లక్ష ధాన్యం బస్తాల గుట్టు తెలుసుకున్న మంత్రి అనుచరులు కొందరు.. వాటిని తలించుకుపోయి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లను వదిలేదిలేదని, అవసరమైతే కేసు నమోదు చేయాలని ఇటీవల గద్వాల, వనపర్తి జిల్లాల్లో జరిగిన సమీక్ష సమావేశాల్లో హెచ్చరికలు జారీచేసిన సదరు మంత్రి అనుచరులే ఈ దోపిడీకి పాల్పడటం గమనార్హం. పైగా మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ చోరీయత్నం జరుగటం సంచలనంగా మారింది. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో రాత్రికి రాత్రే ధాన్యం తరలించేందుకు పథకం వేసినట్టు తెలిసింది. 20 వేల బస్తాల ధాన్యాన్ని ఇప్పటికే లారీల్లో తరలించినట్టు అనుమానిస్తున్నారు. కొంతమంది శుక్రవారం రాత్రి గోదాం నుంచి ధాన్యం బస్తాలు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి రాత్రిపూట ధాన్యం ఎందుకు తరలిస్తున్నారని, దుండగులు కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. 300 బస్తాలు నింపిన డీసీఎంను, మరో బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకొని చిన్నంబావి పోలీస్స్టేషన్కు తరలించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పట్టుబడిన వాహనాలను వదిలేయాలని కొందరు అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. చివరకు వనపర్తి డీఎస్పీ, సీఐ రంగంలో దిగి ఈ వ్యవహారాన్ని చెక్కబెడుతున్నట్టు ఆరోపణలు గుప్పున్నాయి. తరలించుకుపోతున్నది సీఎంఆర్ దాన్యమని తెలిసినా సివిల్ సైప్లె అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తెరవెనక తతంగం నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రం సమీపంలోని ఒక రైస్ మిల్లు గతంలో అక్కడ పనిచేసిన ఒక జిల్లా అధికారి సోదరుడిది. ఆ అధికారి చక్రం తిప్పి తమకు కావలసినవారికి సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించి భారీ కుంభకోణానికి తెరలేపారు. సోదరుడి రైస్ మిల్లుకు వందల టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని దగ్గరుండి కేటాయింపులు జరిపించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. కేటాయించిన ధాన్యాన్ని శ్రీరంగాపూర్తోపాటు మరో రెండు చోట్ల దాచి ఉంచినట్టు అనుమానాలున్నాయి. కొల్లాపూర్ నియోజక వర్గంలోని చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో ఒక గోదాంను లీజుకు తీసుకొని సుమారు లక్ష బస్తాల ధాన్యం దాచి ఉంచినట్టు తెలిసింది. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను ఈ ధాన్యం బస్తాలపై పడింది. వనపర్తి జిల్లాలో సీఎంఆర్ ధాన్యంపై అధికారులు విచారణ జరుపుతుండటంతో ఈ లక్ష బస్తాల ధాన్యం వివరాలు మంత్రి అనుచరులకు అందాయి. ఆ ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు భారీ ప్రణాళిక వేశారు. గోదాం తాళాలు పగులగొట్టి రెండుమూడు రోజుల నుంచి ధాన్యాన్ని లారీల్లో నింపి మరోచోటికి తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ లక్ష బస్తాల ధాన్యం విలువ కోట్లలో ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా వీటిని తరలించి సొమ్ము చేసుకోవాలని పక్కాగా వేసిన ప్లాన్ స్థానికుల ఫిర్యాదుతో బెడిసికొట్టింది. అయితే, పోలీసులపై ఒత్తిడితెచ్చి విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం అప్పుడే మొదలైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి అనుచరుల పాత్ర స్పష్టంగా ఉన్నదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరహర్షివర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.