హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వైరస్కుతోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీలో సుమారు 1,500 కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 1.03,770 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 7,432 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,464, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 606, రంగారెడ్డిలో 504, నిజామాబాద్లో 486, ఖమ్మంలో 325, వరంగల్ అర్బన్లో 323, మహబూబ్నగర్లో 280, జగిత్యాలలో 257, కామారెడ్డిలో 247, మంచిర్యాలలో 222, కరీంనగర్లో 215, భద్రాద్రి కొత్తగూడెంలో 213, సంగారెడ్డిలో 204 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు రాష్ట్రంలో స్వల్పంగా పెరిగి 86.16 శాతంగా నమోదవగా, జాతీయ సగటు 83.5 శాతానికి తగ్గింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది. కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా, వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 11,698 మందికి పాజిటివ్గా తేలింది. 37 మంది మరణించినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రెండు లక్షల మందికి టీకా
రాష్ట్రంలో శుక్రవారం 2.02 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటిడోస్ తీసుకున్నవారు 1.79 లక్షలు కాగా, 23,642 మందికి రెండోడోస్ వేశారు. మొత్తంగా టీకా తీసుకున్నవారి సంఖ్య 38 లక్షలు దాటినట్టు శనివారం బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.