రంగారెడ్డి : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. శంషాబాద్ రాల్లగూడ గ్రామ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో బాలరాజు, శ్వేత దంపతులు పని చేస్తున్నారు. అయితే శ్వేతకు నెలలు నిండడంతో ఆమెకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో భర్త బాలరాజు 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ దేవేందర్, పైలెట్ రవి హుటాహుటిన పద్మావతి ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు.
గర్భిణిని హైదరాబాద్లోని పేట్లబురుజు ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా, ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బందే గర్భిణికి పురుడు పోశారు. శ్వేత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను పేట్లబురుజు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలరాజు, శ్వేత దంపతుల స్వస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర.