హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) అనే పేరును అధికారులు ఖరారుచేశారు. ఈ పోర్టల్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ పోర్టల్ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి గత 12 ఏండ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డాటాను ఇందులో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల హాల్టికెట్ నంబర్ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎవరైనా.. ఎప్పుడైనా సులభంగా వెరిఫికేషన్ చేయించుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు, ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు ఈ పోర్టల్ ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, విద్యార్థుల మెమోలు కావాలనుకుంటే ఆన్లైన్లో డిజిటల్ సంతకం చేసి పంపిస్తారని వెల్లడించారు.