హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. ఇప్పటికే వాతావరణ మార్పులు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే వివిధ రకాల వంగడాలను వినియోగంలోకి తీసుకొచ్చిన ఇక్రిశాట్.. తాజాగా కంది దిగుబడులను పెంచేందుకు కార్యాచరణ రూపొందించి, నూతన వంగడాలతో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నది. ఆ రాష్ర్టాల్లోని 18 జిల్లాల్లో కొత్త రకం కంది విత్తనాలను సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. మూడేండ్లపాటు సాగే ఈ పైలట్ ప్రాజెక్టుకు జాతీయ ఆహార భద్రతా సంస్థ ఆర్థిక సాయం అందిస్తున్నది.